ఎన్నికల సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి
మీడియా సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార మాధ్యమాలకు అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. గురువారం ఐడీఓసీలోని జిల్లా పౌరసంబంధాలఅధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసిందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కర పత్రాలు, వాల్ పోస్టర్లు, వాణిజ్యప్రకటనలు, సిటి కేబుల్లో ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు, ఇతరత్రా ప్రకటనలకు తప్పని సరిగా మీడియా సెంటర్ నుంచి ముందుగా సర్టిఫికేషన్ తీసుకోవాలని చెప్పారు. ప్రచార సామగ్రి ముద్రణలో ప్రచురణకర్త పేరు, సెల్ నెంబర్, ప్రింటింగ్ ప్రెస్ చిరునామా తదితర వివరాలతో మూడు ప్రతులను ఇవ్వాలని, వాటిని పరిశీలన తర్వాతనే అనుమతులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లలో వచ్చే ‘పెయిడ్ న్యూస్’ ను పరిశీలించి వ్యయాన్ని లెక్కించి సంబంధిత అభ్యర్ధుల ఖర్చులకు జమచేయనున్నట్లు చెప్పారు. పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై ఖర్చుల వివరాలను వ్యయ పరిశీలన బృందానికి అందజేయాలన్నారు. ఎన్నికల సంబంధిత ప్రకటనలు ప్రచారాలపై గట్టినిఘా పెట్టాలని, ప్రకటనలు, ప్రచారానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఖర్చు విషయమై రేట్ కార్డు ప్రకారం ఎప్పటికప్పుడు సంబంధిత పార్టీ అభ్యర్థుల ఖర్చులో పొందుపర్చే విధంగా వ్యయ పరిశీలకునికి సమర్పించాలన్నారు. ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.శ్రీనివాసరావు, ఎంసీఎంసీ సభ్యులు శ్రీనివాసన్,జునుమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
