వినికిడిలోపం ఉన్నవారికి ‘గోల్కొండ’, ‘రామప్ప’లో సౌకర్యాలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
చారిత్రక ప్రదేశాల ప్రాశస్త్యం గురించి విని తెలుసుకోలేని బదిరుల కోసం హైదరాబాదు లోని ‘గోల్కొండ కోట’, ములుగు జిల్లా లోని ‘రామప్ప దేవాలయం’లో అదనపు సౌకర్యం కల్పించారు. చారిత్రక ప్రదేశాల పరిరక్షణను పర్యవేక్షించే బాధ్యత కలిగిన కేంద్రప్రభుత్వ సంస్థగా ఉన్న ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోట, రామప్ప దేవాలయం ప్రదేశాల్లో బదిర యాత్రికులకు అర్థమయ్యే రీతిలో ‘సైన్ లాంగ్వేజ్ బోర్డులు’ ఏర్పాటు చేశారు. ఆ బోర్డులపై ఉన్న ‘క్యూ ఆర్ కోడ్’ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అక్కడి విశేషాలు, వివరాలు మొత్తం సైన్ లాంగ్వేజ్ రూపంలో తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ అదనపు ఏర్పాట్ల కారణంగా ఆ చారిత్రక ప్రదేశాల గురించిన విశేషాలను ‘గైడ్స్’ ద్వారా తెలుసుకోవడంలోని సమస్య అధిగమించవచ్చని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెప్తున్నారు.