వెంటాడి… గొంతు కోసి… దారుణంగా హతమార్చారు
నాయకన్ గూడెంలో ఉపాధ్యాయుడి దారుణహత్య…
✍🏽 దివిటీ మీడియా – కూసుమంచి
ఏ కక్ష వారిని దహించివేసిందో… అతని మీద ఎంతగా కోపం పెంచుకున్నారో, ఏమో గానీ…వెంటాడి వేటాడి దారుణంగా చంపిన ఉదంతమిది… కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో పట్టపగలు ప్రభుత్వ ఉపాధ్యాయుడొకరిని వెంటాడి గొంతు కోసి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు, పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామానికి చెందిన బైరోజు వెంకటాచారి(58) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన నడిగూడెం మండలం సిరిపురంలో ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీఈటీగా) గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం ఆయన తనబైకుపై పాఠశాలకు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు నాయకన్ గూడెం గ్రామ శివారులో వెంకటాచారి బైకును మరో బైకుతో ఢీకొట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు వేరొక కారులో వెంటాడుతూ వచ్చి మరీ కిందపడిన అతడిని నడిరోడ్డుపై అతి దారుణంగా గొంతుకోసి హతమార్చారు. ఈ ఘటనలో దుర్మరణం పాలైన వెంకటాచారి, స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాల, టింబర్ డిపో(కలపసామిల్) కూడా నడిపిస్తున్నారు.
ఈ దారుణహత్యపై సమాచారమందుకున్న ఏసీపీ బస్వారెడ్డి, కూసుమంచి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆ హత్య జరిగిన తీరు పరిశీలించారు. వెంకటాచారి హత్యకు దారితీసిన పరిస్థితులపై పలుకోణాల్లో ఆరా తీసి దర్యాప్తు చేస్తున్నారు. దారుణహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.