భార్యపై కోపంతో 8ఏళ్ల కన్నకూతురిని చంపిన కసాయి తండ్రి
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

కట్టుకున్న భార్య మీద కోపంతో 8 సంవత్సరాల తన కన్నకూతురిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపాడో కసాయి తండ్రి. హైదరాబాదులో అబ్దుల్లాపూర్ మెట్ లో రెండురోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నిందితుడు చంద్రశేఖర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం… రెండు రోజుల క్రితం బీహెచ్ఇఎల్ టౌన్ షిప్ లోని స్కూల్ లో నుంచి తన కూతురు మోక్షజను కారులో తీసుకెళ్లిన చంద్రశేఖర్, చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎవరూ చూడని ప్రదేశంలో బ్లేడుతో ఆ చిన్నారి గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆ చిన్నారిని తీసుకుని కారులో వెళ్తూ కోహెడ ప్రాంతంలో ఓ రోడ్ డివైడర్ ను ఢీకొట్టాడు. కారు ప్రమాదం జరిగిందని గమనించిన ఆ ప్రాంత ప్రజలు సాయంచేసేందుకు వచ్చారు. ఆ కారులో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆ చిన్నారి అపస్మారకస్థితిలో రక్తం కారుతూ పడి ఉన్న దృశ్యం చూసిన వారు వెంటనే ఆ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చి చంద్రశేఖర్ ను నిర్భంధించి, పోలీసులకు అప్పగించారు. అప్పటికే చిన్నారి మోక్షజ చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పారేయాలనే ఆదుర్దాలో కారును అవుటర్ రింగురోడ్డు మీదకి తిప్పే ప్రయత్నంలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో చంద్రశేఖర్ దొరికి పోయాడు. పటాన్ చెరు మీదుగా కారులో అబ్దుల్లాపూర్ మెట్ వైపు వచ్చే క్రమంలో ఆ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తన కూతురు మోక్షజను గొంతు కోసి చంపేసిన చంద్రశేఖర్, ఆమె ప్రమాదంలో మరణించిన విధంగా నమ్మించేందుకు కావాలనే కారును డివైడర్ కు ఢీకొట్టాడేమోననే అనుమానం కూడా ఉండటంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల మోక్షజ నాలుగో తరగతి చదువుతున్నట్లు చెప్తున్నారు.