పందుల్ని కాల్చబోయి పాపను కాల్చి చంపాడు
కాకినాడ జిల్లాలో పెనువిషాదం…
దివిటీ మీడియా – కాకినాడ
ఓవైపు దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నంటుతుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఆ జిల్లాలో తుని మండలంలోని వెలమత్తూరు గ్రామం మంగళవారం ఓ నాలుగేళ్ల చిన్నారి మృతి విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… వెలమత్తూరులో నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటుతుపాకులతో వెంట పడి పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నాటు తుపాకీతో పందులను కాల్చే ప్రయత్నంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తూటా గురితప్పి చిన్నారికి తగిలింది. సంఘటనలో ధన్యశ్రీ అక్కడికక్కడే కుప్ప కూలిపోగా, ఆమె స్నేహితులు పరుగునవెళ్లి ఆ బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి తమ చిన్నారిని చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు తన స్నేహితులతో ఆడుతూపాడుతూ గడిపిన చిన్నారి ధన్యశ్రీ మరణంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు విలపిస్తున్న తీరు అందరి మనసులను కలచివేసింది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న తుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యం చిన్నారి నిండుప్రాణాన్ని బలిగొనడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.