గృహలక్ష్మి పథకంలో అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి
లబ్ధిదారుల ఎంపిక కోసం సమగ్ర పరిశీలన చేపట్టాలి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – మహబూబాబాద్
అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పధకం అందేలా అధికారులు పరిశీలన చేపట్టాలని మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక జిల్లా పరిధిలోని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ సమావేశమందిరంలో గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులను గుర్తించే విధివిధానాలపై పరిశీలనాధికారులకు సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గృహలక్ష్మి పధకంలో లబ్ది కోసం 52,241 దరఖాస్తులు అందినట్లు తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీ నుంచి 20వ తేదీలోగా మండలస్థాయి అధికారితో పాటు జూనియర్ అధికారి ఓ బృందంగా ఏర్పాటై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులనే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఈ లబ్ధిదారులకు ఓటరు గుర్తింపుకార్డు తప్పని సరిగా ఉండాలన్నారు. గ్రామంలో నివాసిగా గుర్తింపు కలిగి, సొంత ఇంటిస్థలం కలిగి ఉండాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద స్వీకరించిన దరఖాస్తుల నివేదిక హార్డ్, సాఫ్ట్ కాపీలు అందజేయాలని ఆదేశించారు. ఈ గృహలక్ష్మి పథకం కింద మహబూబాబాద్ నియోజకవర్గానికి 3వేలు, డోర్నకల్ 3వేలు గృహాలు కేటాయించినట్లు వెల్లడించారు. పాలకుర్తి, ములుగు, ఇల్లందు నియోజక వర్గాలకు కేటాయించిన 2670 గృహాలతో కలిపి మొత్తం మహబూబాబాద్ జిల్లాలో 8,670మంది లబ్ధిదారుల్ని ఎంపికచేయాల్సి ఉందన్నారు. గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటి జాగాలో ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం రూ.3 లక్షలు సహకారాన్ని అందిస్తుందన్నారు. గృహలక్ష్మి కింద ఇంటి మంజూరు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇప్పటికే సొంతిల్లు ఉండ కూడదని, వారు తప్పనిసరిగా స్థానికులై ఉండాలన్నారు. 18 సంవత్సరాలు పైబడి ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికల ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. ఈ అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీ సీఈఓ రమాదేవి, డి.ఆర్.డి.ఎ పిడి సన్యాసయ్య, పలువురు జిల్లా అధికారులు, ఎంపీడీవోలు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.