ఇంతకీ ఆమెను కిడ్నాప్ చేసిందెవరు…?
ప్రేమ పెళ్లి చేసుకున్న నవవధువు కిడ్నాప్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఇటీవలే తమ పెద్దలను ఎదిరించి, ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవవధువు కిడ్నాప్ నకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన గురువారం కొత్తగూడెంలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న దంపతులపై సినీఫక్కీలో దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు నవదంపతుల మీద దాడిచేసి, ఆ భర్తను కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కిడ్నాప్ వెనుక అసలు ఏం జరిగిందనేదానిపై ఆరా తీసిన పోలీసులకు ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిసాయి. ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం పట్టణానికి చెందిన గొగ్గెల మాధవి కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఇటీవలే వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టంలేకుండా తాము పెళ్లి చేసుకోవడం సహించలేని మాధవి కుటుంబ సభ్యులు ఈ దురాగతానికి పాల్పడినట్లు సన్నీ చెప్తున్న వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరీక్ష రాయడానికి మాధవిని ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తాను తీసుకెళ్తుండగా, మార్గంమధ్యలో కారులో తమను ఛేజ్ చేసి తనపై దాడిచేసి గాయపర్చిన దుండగులు తన భార్యను బలవంతంగా కారులోకి నెట్టి ఎత్తుకెళ్లారని సన్నీ ఆరోపిస్తున్నారు. తమ
కులాంతర ప్రేమవివాహం కారణంగానే తన భార్యను కిడ్నాప్ చేశారని ఆమెతోపాటుగా, తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు సన్నీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సన్నీ మాత్రం మాధవి కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్ ఘటన ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.