‘తరం మారుతుంది మోదీ.. జాగ్రత్తగా ఉండు..’

బీఆర్ఎస్వీ నిరసనలో కేంద్రప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)
‘తరం మారుతుంది మోదీ.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం హైదరాబాద్ లో తమ పార్టీ అనుబంధ విభాగమైన బీఆర్ఎస్వీ నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలన్నారు.
ఢిల్లీలో ఘటనలు చూస్తే తనకళ్లలో నీళ్లు వచ్చాయని, ఈతరం చావుకు భయపడే రకంకాదని వ్యాఖ్యానించారు. ఇండియా రియాక్ట్స్ అని గతంలో చెప్పిన కేసీఆర్, అవసరమైతే మీకోసం వస్తారన్నారు. ఈ ప్రభుత్వాలపై జెన్-జీ యువత పోరాటం చేస్తారని తాను కూడా సంవత్సరం క్రితం చెప్పానని గుర్తు చేశారు. ఈ రోజు కాక్రోచ్ జనతా పేరుతో దేశమంతా విద్యార్థులు, యువత ఉద్యమాలు చేస్తున్నారన్నారు.
నేపాల్లో యువత తలుచుకుంటే ఆ ప్రభుత్వమే కూలిపోయిందని, జెన్-జీతో జాగ్రత్తగా ఉండమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మతం అంటారు.. దేశం కోసం, ధర్మం కోసం అంటారు మరి ఈ పిల్లలు హిందువులు కాదా?’ అంటూ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్చుక్ దీక్షను ఒక్కమీడియా కూడా చూపించలేదని ఆరోపించారు. ఈ విద్యార్థులు తమకు సోషల్ మీడియా ఉందనే ధైర్యంతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే దారి మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారంటూ నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. ‘బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు’ అని మోదీని అంటే ఈ కేడీగాడికేమైంది?
అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మోదీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి కొడంగల్లో దాక్కుందని విమర్శించారు.

