యూనిఫాంల నాణ్యతపై ‘ఫీడ్ బ్యాక్’ తీసుకుంటాం : సీఎం
✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)
రాష్ట్రంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు తదితర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్ బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పంపిణీ, వాటి రంగులు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫాంల అందజేతపై ముఖ్యమంత్రి ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో గురువారం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యత విషయంలో రాజీపడబోమని సీఎం స్పష్టం చేశారు.ఆగస్టు 15వ తేదీ నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించ బోనని హెచ్చరించారు. ఐకేపీ మహిళా సంఘాలు కుట్టుపని వేగవంతం చేసేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాంలు అందించడంలో అడ్డగోలు గా వ్యవహరించారని, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నందున నాణ్యమైన యూనిఫాంలు అందిస్తామన్నారు. పేద పిల్లలకోసం పనిచేస్తున్నామన్న అంశం దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థులకు యూనిఫాంలు అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

