పరిశ్రమల స్థాపన, ఉత్పత్తుల మార్కెటింగ్ పై శిక్షణ

✍️ కొత్తగూడెం – దివిటీ (జూన్ 17)
పరిశ్రమల స్థాపన, రుణాలు పొందే విధానం, ఉడ్యమి రిజిస్ట్రేషన్, నైపుణ్యం పెంపుదల, ఆ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై అందిస్తున్న శిక్షణ, సాయం గురించి కొత్తగూడెంలో మహిళలకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తగూడెంలో పాత డీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ అఫ్ ఇండియా (ALEAP) ప్రపంచ బ్యాంక్ నిధులతో భారత ప్రభుత్వ నిర్వహిస్తున్న RAMP (రైసింగ్ అండ్ యాక్సలెరేటింగ్ ఎంఎస్ఎంఇ పెర్ఫార్మెన్స్) లో భాగంగా ఈ సదస్సు నిర్వహించారు. అనంతరం మరో పదిహేను రోజులపాటు పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెళుకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ (Entrepreneurship and Skill Development Programme) నిర్వహించనున్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఉద్యమి రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణ సహాయం కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ అవగాహన సదస్సులో సీహెచ్.అనూరాధ (APM NF), జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అలీప్ కమిటీ సభ్యురాలు పద్మావతి, అన్నపూర్ణ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.