ఐటీసీలో కార్మికసంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

జనవరి 31న జరగనున్న ఎన్నికలు
✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 8)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ‘ఐటీసీ – పి.ఎస్.పి.డి’లో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలు జనవరి 31న నిర్వహించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం(జనవరి 8న) ఖమ్మం కలెక్టరేట్ (ఐడీఓసీ) లోని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ గురించి చర్చించారు.

ప్రతిపక్ష ఐఎన్టీయూసీ, మిత్రపక్షాలు గత సెప్టెంబరు 17వ తేదీన రాష్ట్ర కార్మికశాఖాధికారులకు డిమాండ్ నోటీసు ఇచ్చాయి. గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి గడిచిన జులై 4వ తేదీ నాటికే ముగియటంతో ఎన్నికలు తిరిగి నిర్వహించాలని కోరారు. ఈ పరిశ్రమలో రిజిస్టర్ కార్మిక సంఘాలు దాదాపు 23 వరకు ఉండగా, ప్ఇరప్రస్తుతం ఎన్నికల్లో 14 సంఘాలకు అర్హత లభించినట్లు సమాచారం. కాకపోతే ఈ ఎన్నికల్లో 5పక్షాలు పోటీలోకి దిగాయి. ఐటీసీలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణం అమల్లోకి వచ్చింది. ఐటీసీ పేపర్ పరిశ్రమలో జరిగే ఎన్నికలను కార్మిక సంఘాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతిసారీ ద్విముఖ పోటీ హోరాహోరీగా జరుగుతూ వస్తోంది. గతంలో కొన్నిసార్లు మాత్రమే త్రిముఖపోటీ జరిగింది. ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ మిత్రపక్షాలకు ‘ఒకసారి వారు, మరొక్క సారి వీరు’ అన్నరీతిలో కార్మికులు పట్టంకడుతున్నారు. ప్రస్తుతం 1195మంది కార్మికుల సంఖ్య ఉన్న ఈ ఐటీసీ పరిశ్రమలో రిటైర్మెంట్లు పోగా 1177మంది ఓటుహక్కు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులతోపాటు వేలాదిగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, సంక్షేమం విషయంలో బాధ్యత కలిగిన ‘గుర్తింపు కార్మికసంఘం’ ఎన్నిక విషయంలో మరో సారి తీర్పుకోసం కార్మిక సంఘాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో అధికారికంగా జనవరి 31న ఈ ఎన్నికలు నిర్వహించే విషయం ఖరారు కావడంతో ఐటీసీలో కోలాహలం మరింతగా పెరుగుతోంది. ఈ పరిశ్రమలో ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా విద్య, వైద్యం, వసతి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితరాలు ప్రచారంలో కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు లేకపోయినప్పటికీ ప్రచారం విషయంలో కాంట్రాక్ట్ కార్మికులు కీలకం కానున్నారు. తమ సంక్షేమం పట్ల కృషి చేస్తున్న సంఘానికి అనుకూలంగా వారు ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో 22రోజులు మాత్రమే సమయం ఉండగా విజయం కోసం కార్మికసంఘూలు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.