Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (మే 21)

రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయాధికారులతో సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నకిలీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. అమాయక రైతులను మోసం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని తెలిపారు. కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలని చెప్పి రైతులకు అమ్మడం ద్వారా సరైన దిగుబడి రాక రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టే విధంగారాష్టస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. మేలురకం విత్తనాలనే విక్రయించేలా చేసి నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా చేసేవారిపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు అప్రమత్తంగా సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వానాకాలం పంట సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిని అరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విత్తనాల దుకాణాల యజమానులకు పలు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాల సరఫరాదారులను గుర్తించి, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. లైసెన్సులు లేకుండా దుకాణాలు నడిపినా, రికార్థులు సరైన పద్దతిలో నిర్వహించకపోయినా,నకిలీ విత్తనాలు విక్రయించినా ఆ యజమానులపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాల జారీ చేసినట్లు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలు కొని వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలు గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణా, సరఫరా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Related posts

బూర్గంపాడులో సీపీఎం నాయకుల నిరసన

Divitimedia

ప్రాణాలు పోయినా ఫర్వాలేదా… ?

Divitimedia

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

Divitimedia

Leave a Comment