ప్రతి ఇంటికి త్రాగునీరందేలా చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 27
ప్రతి ఇంటికి త్రాగునీరందేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈఈ, డీఈలు, పబ్లిక్ హెల్త్ డీఈలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, స్పెషల్ ఆఫీసర్లతో త్రాగునీటి సరఫరా, పనుల పురోగతిపై టెలికాన్ఫరెన్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి ప్రతి ఇంటికి నీరందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, రాబోయే మూడు నెలల్లో గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరందించాలన్నారు. గ్రామంలోని నీటి వసతులు, అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు, హ్యాండ్ పంపులు, బోర్ వెల్స్, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. బోర్లు, హ్యాండ్ పంపులు, మోటార్లు, పైపుల లీకేజీలకు అవసరమైన మరమ్మత్తులు త్వరిత గతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని అన్ని నీటి సరఫరా ప్రాంతాలను ప్రతిరోజు విధిగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అవసరం ఉన్నచోట బోర్ వెల్స్ అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీరు బల్క్ సప్లై సరిపోకపోతే సప్లై పెంచాలని మిషన్ భగీరథ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్.డి.ఎఫ్ లో ప్రతిపాదించిన పనులను పురోగతిలో ఉన్నవి, పూర్తి అయినవి, పూర్తి కావలసినవి తదితర వివరాలు పట్టిక రూపంలో నమోదు చేసి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లా పర్యటనలో భాగంగా అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని, ఎటువంటి పొరపాట్లు లేకుండా త్రాగునీటి సరఫరాపై ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల అధికారులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ విద్యాచందన, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.