Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StylePoliticsTelangana

రాత్రింబవళ్లు కష్టపడుతున్న రెవెన్యూ అధికారులు

రాత్రింబవళ్లు కష్టపడుతున్న రెవెన్యూ అధికారులు

కొత్తదారులు వెతుక్కుంటున్న ఇసుక అక్రమార్కులు

✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 25

ఇసుక అక్రమ రవాణా కేంద్రాల్లో ఒకటిగా మారిన  బూర్గంపాడు మండలంలో అక్రమార్కుల చర్యలు నిరోధించేందుకు రెవెన్యూ అధికారులు రాత్రివేళల్లో నిద్ర కూడా పోకుండా కష్టపడుతున్నారు. మూడు రోజుల నుంచి ఇసుక అక్రమ రవాణా నిరోధానికి తహసిల్దారు ముజాహిద్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు రెండురోజుల నుంచి రెవెన్యూ అధికారుల బృందాలు సారపాక, బుడ్డగూడెం ప్రాంతాల్లో రాత్రి వేళ పహరా కాస్తున్నారు. మండలంలోని పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా వాహనాలను అడ్డుకునేలా దారులలో కందకాలు తవ్వించారు. సారపాక బ్రిడ్జి ప్రాంతంలో అధికారులు తీయించిన కందకాలను ఇసుక అక్రమ రవాణాదారులు పూడ్చివేసి మరీ తమ అక్రమ రవాణా కొనసాగించాలని ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ స్థాయిలో అక్రమార్కులు తెగిస్తారని ఊహించని అధికారులు వారిపై స్థానిక  పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయడం ద్వారా పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు రాత్రివేళల్లో కర్రలతో గస్తీ కొనాసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి బుడ్డగూడెం దగ్గర నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ ను స్థానిక  రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహరావు ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. సారపాక బ్రిడ్జి ప్రాంతంలో కూడా డిప్యూటీ తహసిల్దారు రాంనరేష్ బృందం కాపలా కాసి, ఇసుక తరలించే ఎడ్లబండ్లు పట్టుకున్నారు. అంతకుముందు ప్రతి రోజూ సారపాక బ్రిడ్జి ప్రాంతంలో ట్రాక్టర్లు, లారీల్లో  దర్జాగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ ఏ అధికారి పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడం విశేషం. తాజాగా రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యల వల్ల అక్రమార్కులు సరికొత్త దారులను వెతుక్కునే పనిలో పడ్డారు. రాజకీయంగా వత్తిడి తీసుకురావడం, మరోవైపు ఇసుక కొరతతో వచ్చే ఇబ్బందులను అడ్డం పెట్టుకుని అధికారులపై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక ప్రక్రియలో కంటే అక్రమ రవాణా ద్వారానే ఎక్కువ లాభాలు గడిస్తున్న అక్రమార్కులు, అధికారులపై వత్తిడి తీసుకొచ్చి బెదిరించేందుకు  ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా చెప్పేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటివరకు మండలంలో ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్ పెట్టిన’ అధికారులపై రాజకీయంగా వత్తిడి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కోసం సారపాకలో బ్రిడ్జి వద్ద కందకాలను పూడ్చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తహసిల్దారు ముజాహిద్ వెల్లడించారు.

Related posts

▶ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Divitimedia

బ్రిలియంట్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

Divitimedia

పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

Divitimedia

Leave a Comment