భద్రాచలం గిరిజన గురుకులానికి పతకాల పంట…
నల్గొండ ఆటల పోటీల్లో మెరిసిన గిరి బిడ్డలు
మెగా ఓవరాల్, వ్యక్తిగత చాంపియన్ షిప్ లు కైవసం
బాలికలను అభినందించిన ఆర్సీఓ డేవిడ్ రాజ్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
నల్లగొండ జిల్లా దామరచర్లలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల జోనల్ స్థాయిలో ఈనెల 13,14,15వ తేదీల్లో జరిగిన గిరిజన గురుకుల క్రీడాపోటీల్లో భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు పాల్గొని అత్యుత్తమ క్రీడాప్రతిభతో పతకాల పంట పండించారు. ఈ పోటీలలో అండర్ -14, అండర్ -17, అండర్-19 విభాగాలలో ఈ విద్యాలయ క్రీడాకారులు తమ ప్రతిభతో మెగా, ఓవరాల్, వ్యక్తిగత చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. అండర్-19 విభాగం లో వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్ బాల్, చెస్ పోటీల్లో విన్నర్స్, వాలీబాల్, ఖోఖో పోటీల్లో రనర్స్ గా నిలిచారు. హెచ్ఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీతేజ అథ్లెటిక్స్ లో 100మీటర్లు, 200మీటర్లు, 400మీటర్లు లాంగ్ జంప్, హై జంప్, 4×100మీటర్ల రిలే, 4×400 మీటర్ల రిలేలో ప్రథమస్థానం, షాట్ ఫుట్ లో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని ఓవరాల్ ఛాంపియన్షిప్ పొందింది. 3000 మీటర్లలో ద్వితీయస్థానం,1500 మీటర్లలో ద్వితీయస్థానాన్ని నవదీపిక సాధించింది.400మీటర్ల పరుగు పందెంలో మహేశ్వరి ద్వితీయస్థానం, 800మీటర్లలో ఎం.అలేఖ్య ద్వితీయస్థానం పొందింది. చదరంగంలో ధనుశ్రీ ప్రథమస్థానం పొందింది. అండర్-17 విభాగంలో విలువిద్యలో ప్రథమస్థానం, ద్వితీయస్థానం, బాల్ బ్యాడ్మింటన్ లో ప్రథమ స్థానం లభించింది. అథ్లెటిక్స్ లో కె.జాహ్నవి 800మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం, అనుష్క1500మీటర్ల పరుగు పందెంలో తృతీయస్థానం,3000 మీటర్లలో తృతీయస్థానం, హైజంప్ లో ప్రథమస్థానం సాధించింది. 4×100మీటర్లలో ప్రథమ స్థానం, 4×400 మీటర్లలో ప్రథమస్థానం సాధించారు. ఇందు అనే విద్యార్థిని 200 మీటర్ల పరుగుపందెంలో ప్రధమస్థానం,షాట్ పుట్ లో ప్రథమస్థానం, డిస్కస్ త్రోలో ప్రథమస్థానం, 4×100 మీటర్లలో ప్రథమ స్థానం, లాంగ్ జంప్ లో తృతీయస్థానం, హై జంప్ లో తృతీయస్థానం సాధించింది. అండర్-17 విభాగంలో అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది. అండర్-14 విభాగంలో ఆశ్చర్య ప్రథమస్థానం, ద్వితీయ స్థానం సాధించారు. లావణ్య 200 మీ.లో ద్వితీయ స్థానం, సుహాసిని 600 మీ.లో తృతీయస్థానం, బి.కావ్య లాంగ్ జంప్ లో ప్రథమస్థానం, కె.శ్రీజ చదరంగంలో ప్రథమ స్థానం, 4×100 మీటర్ల రిలేలో తృతీయ స్థానం సాధించారు.
——————————
బాలికలను అభినందించిన ఆర్సీఓ
——————————
నల్గొండ జిల్లాలో మూడు రోజులపాటు జరిగిన గిరిజన గురుకుల బాలికల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలస్థాయి జోనల్ క్రీడా పోటీల్లో మెగా, ఓవరాల్, వ్యక్తిగత చాంపియన్ షిప్ లు సాధించడంతోపాటు అన్ని విభాగాల్లో పైచేయి సాధించిన భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలను భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ (జనరల్), ఇంచార్జ్ ఆర్సీఓ డేవిడ్ రాజ్ సోమవారం అభినందించారు. ఆయన భద్రాచలం గిరిజన గురుకులం సందర్శించి ఆటల్లో గెలుపొందిన ప్రతి విద్యార్థినిని, ఈ విజయానికి దోహదపడిన సంస్థ ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు, పిడి, పీఈటీలను ఎంతో మెచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ గిరిబిడ్డల విద్య ప్రగతితోపాటు, శారీర దారుఢ్యానికి దోహదపడే క్రీడలను సైతం ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. గురుకులాలు బలోపేతమయ్యాయన్నారు. భద్రాచలం గిరిజన గురుకులం బాలికలు ఓవైపు ఎన్ఐటి, ఐఐటి, ఎంబిబిఎస్ సీట్లు సాధించి విద్యలో రాణించడమే కాకుండా, క్రీడల్లో సైతం మెరిసి ‘భళా’ అనిపించారని ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భద్రాచలం గిరిజన గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ దేవదాసు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పీఈటి, పీడీ, నాన్ టీచింగ్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.