ఓటరు జాబితాలపై నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు : ఐటీడీఏ పీఓ
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
ఓటరు జాబితాలో అవసరమైన వివరాలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించేవారిపై కఠినచర్యలు తప్పవని పినపాక(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ అధికారులను హెచ్చరించారు. ఆయన ఈమేరకు గురువారం నియోజకవర్గ పరిధి లోని ఎంపీడీఓలు, సీడీపీఓలతో ఐటీడీఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పలురకాల అంశాల మీద ఆదేశాలు జారీ చేశారు. 80 ఏళ్లకు పైబడినవారు, పిడబ్ల్యుడి పెన్షనర్స్ పేర్లు ఓటర్ లిస్టులో మార్కింగ్ చేయాలని, ఈ జాబితాపై ప్రత్యేకశ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుని తీసుకోవాలని గ్రామపంచాయతీసెక్రెటరీలు, బిఎల్ఓలను ఆదేశించారు. సీడీపీఓలు శ్రద్ధ తీసుకుని 40 శాతం పైబడిన దివ్యాంగుల, 80 శాతం వారి జాబితాలు రూపొందించేలా చూడాలన్నారు. ఈ అంశంపై ఎంపీడీవోలు, తహసిల్దార్లను సంప్రదించి, అందరూ కలిసి సమన్వయంతో ప్రత్యేక నిర్ణయం తీసుకుని జాబితాలు తయారు చేయాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎన్నికల నాయబ్ తహసిల్దార్ నాగరాజు, ఏఈఆర్ఓ రాఘవరెడ్డి, సిబ్బంది రాంనాయక్, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

