‘ప్రజావాణి’లో దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించిన కలెక్టర్

దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ప్రజలందజేసిన దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి దరఖాస్తు పైన సంబంధిత శాఖల అధికారులు నిశితంగా పరిశీలనచేసి, ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రజావాణిలో
సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలిచ్చిన దరఖాస్తులలో కొన్ని…
——————————–
పినపాక మండలం, భూపాలపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ కొర్స కృష్ణంరాజు ఒక భూమ సర్వే విషయంలో జరిగిన ఆలస్యం, పొరపాట్ల విషయంలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
మణుగూరు మండలం, బండారుగూడెం ఆదర్శనగర్ కు చెందిన చల్లా నర్సయ్య అనే వృద్ధుడు, తన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
ములకలపల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన కారం దావీద్, తమ గ్రామంలో తాగునీటిసౌకర్యం, డ్రైనేజి వ్యవస్థ, పారిశుద్ధ్యం నిర్వహణ, తదితర సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.
చండ్రుగొండ మండలం, తిప్పనపల్లితండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిపట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేశారు. * మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన చెక్కా రమేష్ అనే వ్యక్తి దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని కలెక్టరుకు దరఖాస్తు చేశారు.
పాల్వంచ మండలం, దేవిజతండాలోని మినీ అంగన్ వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తూ తన అత్త భూక్యా పాతిలి అనారోగ్య కారణాలతో గత నెలలో మరణించినందున ఆ టీచర్ పోస్టు తనకు ఇప్పించాలని పునుకుల గ్రామానికి చెందిన భూక్యా శారద దరఖాస్తు అందజేశారు.
