పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభించిన ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదాభార్గవి

✍️ దివిటీ – అమరావతి(డిసెంబర్ 20)
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర సందాలకులు సదాభార్గవి తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని శనివారం ఎ.కొండూరులోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమపాఠశాలలో డైరెక్టర్ సదాభార్గవి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు 5 నిమిషాలు పరిశుభ్రతకు కేటాయించడం ద్వారా చిన్నారులు పూర్తి ఆరోగ్యవంతులుగా మారతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తోందని, సంక్షేమ విద్యాసంస్థలలో విద్యార్ధులను కంటికిరెప్పలా కాచుకుంటూ విద్య, ఆరోగ్యం, ఆహ్లాదం వంటి అన్నిరంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యం పట్ల రాష్ట్రస్థాయి నుంచి ‘JNB నివాస్ పోర్టల్’ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులతో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమానికి సంభంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ‘ముస్తాబు’ కార్నర్, ‘ముస్తాబు’ పోస్టర్లను సంచాలకులు ప్రారంభించారు. అనంతరం ఆ ఆశ్రమ పాఠళాలను సందాలకులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తరగతిలో విద్యార్ధులతో విద్యా సంబంధిత అంశాల్లో ప్రగతి, ఉపాధ్యాయుల బోధన తీరును ఆమె పరిశీలిందారు. వసతిగృహంతోపాటు భోజనశాల, వంటగది, వండిన ఆహారం కూడా క్షుణ్ణంగా తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. హస్టల్ నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం.ఫణిదూర్జటి, ఎ.కొండూరు ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఎంఈఓ కేశవరావు, పాఠశాల హెచ్ఎం జి.కవిత, ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

