గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష
ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా
✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 25)
గంజాయితో పట్టుబడిన కేసులో ఇద్దరు నిందితులకు 10 సంవత్సరాల జైలుశిక్ష, ఒక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానాలు విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి(ఎన్డీపీఎస్ స్పెషల్ జడ్జ్) ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి… 2020 సెప్టెంబర్ 15న భద్రాచలం టౌన్ అప్పటి ఎస్సై బి.మహేష్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఓ మినీగూడ్స్ వ్యాన్ అతివేగంగా వస్తోంది. పోలీసులు వాహనం ఆపి పరిశీలించగా, 226.500 కిలోలు గంజాయి కలిగిన 10 ప్లాస్టిక్ ప్యాకెట్లు (మొత్తం విలువ రూ. 33.97లక్షలు కలిగినవి) పట్టుబడ్డాయి. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాకు చెందిన నిందితులిద్దరు సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్ లను అదుపులోకి తీసుకుని ఎస్సై మహేష్, అప్పటి సీఐ టి.స్వామికి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం సీఐ స్వామి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో ముగ్గురు సాక్షులను విచారించిన తర్వాత సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్ పై నేరం రుజువు కాగా, ఇద్దరికీ 10 సంవత్సరాల చొప్పున జైలుశిక్ష, ఇద్దరికీ ఒక్కొక్కరికీ రూ.1లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని యెడల 6నెలల సాధారణ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి.లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి.రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎస్.వీరభద్రం (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పీసీ సుధీర్ బాబు సహకరించారు.

