జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో తెలంగాణకు అవకాశమివ్వాలి

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తొలి సమావేశంలో తీర్మానం
✍️ దివిటీ (హైదరాబాద్) ఆగస్టు 28
ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ తదితర జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో ఈసారి ఎప్పుడైనా తెలంగాణకు అవకాశం కల్పించాలని కోరుతూ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తొలి పాలకవర్గ సమావేశం తీర్మానం చేసింది. రాష్ట్రంలో అన్ని స్టేడియంల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడాపాలసీలో వివిధ అంశాలపై ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు కోసం సబ్ కమిటీలు ఏర్పాటు వంటి తీర్మానాలు బోర్డు ఆమోదించింది. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం జరిగిన ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ పాలకమండలి తొలి సమావేశంలో సీఎం ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడావిధానం, క్రీడలకు ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడు కోవాలనేదే తన లక్ష్యమన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని, ఆ తరహాలోనే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలషిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. క్రీడారంగం ప్రోత్సాహం కోసం గతంతో పోల్చితే తాము 16 రెట్లు బడ్జెట్ పెంచామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. క్రీడారంగానికి మరింత ప్రాధాన్యత పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.

హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియంలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా సదుపాయాలు సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడారంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. క్రీడారంగాభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్ హబ్ చైర్మన్, ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా, కో-చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల, సభ్యులు భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, ధాని ఫౌండేషన్ వీతా ధాని, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, విశ్వ సముద్ర ఫౌండేషన్ చింతా శశిధర్, క్రీడా నిర్వాహకులు బియ్యాల పాపారావు, ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి, ఏఐపీఎస్–ఏసియా వైస్ ప్రెసిడెంట్ సబా నాయకన్ క్రీడాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.

వాటిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇప్పటి వరకు ఉన్న క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయిలలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. శాసనసభ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య పార్లమెంట్ నియోజకవర్గస్థాయి పోటీలు నిర్వహించి అంతిమంగా రాష్ట్రస్థాయి పోటీలు కూడా నిర్వహించి రాష్ట్రస్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు. క్రీడా సామగ్రిపై పన్నుల తగ్గింపు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని, రాష్ట్ర స్థాయిలో అవసరమైన ప్రోత్సాహాకాలు అందిస్తామని తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశ పెడతామని చెప్పారు. స్టేడియంలు పెద్ద సంఖ్యలో ఉన్నా తగినసంఖ్యలో కోచ్లు లేరని, ఉన్న కోచ్లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లు శిక్షణ ఇప్పించాల్సి ఉందన్నారు. రానున్న మూడేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు.

సమావేశంలో రాష్ట్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి పాల్గొన్నారు.