ఏటీసీని పరిశీలించిన జిల్లా కలెక్టర్
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 21)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కృష్ణసాగర్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC)ను జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ గురువారం సందర్శించి అక్కడి ఆధునిక పరికరాలు, శిక్షణ ల్యాబొరేటరీలు, వర్క్ షాప్ విభాగాలు, తరగతి గదులను పరిశీలించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి, వారు పొందుతున్న శిక్షణ, ఆ సంస్థలోని సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. మరింత కృషి చేసి మంచి అవకాశాలు సాధించాలని వారికి సూచించారు. నేర్చుకుంటున్న అంశాలు, ప్రాక్టికల్ శిక్షణ పద్ధతులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడిన కలెక్టర్ వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ, ఏటీసీ వంటి ఆధునిక శిక్షణా కేంద్రాలు యువతలో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను విస్తరించడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, స్మార్ట్ బోర్డులు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ ద్వారా విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు. ఏటీసీ వంటి శిక్షణా కేంద్రాలు ఈ దిశగా ఉపయోగపడతాయన్నారు. తమ శిక్షణ కేంద్రంలో మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు కలెక్టరుకు వివరించారు. ఒక్కొక్క కోర్సుకు 20 నుంచి 40 సీట్ల వరకు, ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు వ్యవధితో శిక్షణ పొందే అవకాశం కల్పించబడిందని, ఈ కోర్సులకు కనీస అర్హత 10 తరగతి ఉత్తీర్ణతగా ఉందని తెలిపారు. ఐటీఐ ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.