పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి
90 రోజులపాటు మధ్యవర్తిత్వం డ్రైవ్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 90 రోజులపాటు ‘మధ్యవర్తిత్వం డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్, కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘దేశం కోసం మీడియేషన్’ అనే పేరుతో ఈ డ్రైవ్ ను నల్సా-న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదాతోపాటు సత్వర న్యాయ పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ మధ్యవర్తిత్వంలో వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు, ప్రమాద క్లెయిమ్ లు, గృహహింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, రుణ రికవరీ కేసులు, తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని వారు తెలిపారు. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

