భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి సీఆర్పీఎఫ్ అభినందనలు

సీఆర్పీఎఫ్ ఐజీ చేతుల మీదుగా డీజీ డిస్క్, ప్రశంసాపత్రం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 24)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసి, గత పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషిచేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు సీఆర్పీఎఫ్ అభినందనలు లభించాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాదులో సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ కార్యాలయంలో సీఆర్పీఎఫ్ ఐజీపీ చారుసిన్హా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు డీజీడిస్క్, ప్రశంసాపత్రం అందజేశారు. నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, సమర్థవంతంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేసినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. జిల్లాలో విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా పూర్తి చేయగలిగామని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు. ప్రత్యేక గుర్తింపు సాధించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఈ సందర్భంగా పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.