బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా అందించండి
రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 15)
గుర్తింపు పొందిన అన్ని రాజకీయపార్టీలు జిల్లాలో ఇన్ఛార్జ్ ధ్రువీకరణతో బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలు ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ కోరారు. ఎన్నికలసంఘం ఆదేశాల మేరకు శనివారం ఐడీఓసీ కార్యాలయం సమావేశంమందిరంలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల జిల్లా నాయకులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు జాబితా సవరణ సంబంధిత ఫారాలు 6, 7, 8లపై అవగాహన కల్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణకు పోలింగ్ బూత్స్, ఓటరు జాబితాలో సమస్యలు, వంటి వాటిపై సూచనలిస్తే పరిష్కరిస్తామని తెలిపారు. నూతన ఓటరు నమోదు, తప్పుల సవరణ, ఓటర్ తొలగింపు, తదితర అంశాలపై రాజకీయపార్టీలకు పూర్తి అవగాహన అవసరమన్నారు. ఫామ్ – 6 దరఖాస్తు ద్వారా నూతనంగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫామ్-7 తో తొలగింపు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తులపై బీఎల్ఓలు విచారణ చేసి, నోటీసులు జారీచేసిన తర్వాత మాత్రమే తొలగింపు చేపడతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఫామ్-8తో తప్పుల సవరణ, ఫొటో మార్పు, ఓటర్ షిఫ్టింగ్, తదితర సేవలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఫామ్ – 6, 7, 8 లలో 19,514 దరఖాస్తులు రాగా అందులో 10944 దరఖాస్తులు పరిష్కరించినట్లు, 1,310 దరఖాస్తులు తిరస్కరించినట్లు, 7,260 దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. కొత్తగా ఓటుహక్కు నమోదు, మార్పు, చేర్పులు, తదితర సేవల కోసం ఎక్కడకూ తిరిగే అవసరం లేకుండా బీఎల్ఓ యాప్ లో అన్ని సేవలు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాజకీయపార్టీ నాయకులకు వచ్చే శనివారం బీఎల్ఓ యాప్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లాకలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు అవగాహన కల్పించి, 18సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునే విధంగా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ దారా ప్రసాద్,కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సీపీఎం జిల్లా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.