సౌకర్యాలు కల్పించని ‘ట్రావెల్స్’ నుంచి పరిహారం వసూలు
ఖమ్మం వినియోగదారుల ఫోరం ఆదేశాలు
✍️ ఖమ్మం, హైదరాబాద్ – దివిటీ (మార్చి 5)
థాయిలాండ్ దేశ విహారయాత్ర కోసం డబ్బులు తీసుకుని ఆ విహారయాత్రలో సరైన సౌకర్యాలు అందించకుండా ఇబ్బందికి గురిచేసిన అర్చన ట్రావెల్స్, సంబంధిత వినియోగదారుకు పరిహారం చెల్లించాల్సిందిగా ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత బుధవారం తీర్పునిచ్చారు. ఆ ఫిర్యాదు దారుని తరపున న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, ఎం.అప్పారావు, కొలికొండ శరత్ బాబు ఈ కేసును జిల్లా వినియోగదారుల రక్షణ కమిషన్ లో నమోదు చేశారు. వారి కథనం ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి…
ఖమ్మం జిల్లా ధంసలాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త తుమ్మ అప్పిరెడ్డి, తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన అర్చన ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, టూర్ ఆపరేటర్ బద్దం బోజిరెడ్డి ద్వారా 2023 ఏప్రిల్ నెలలో రూ.71,000 అడ్వాన్సుగా చెల్లించి టూర్ ప్యాకేజ్ తీసుకున్నారు. కాగా ట్రావెల్స్ వారు అప్పటి నుంచి ఏవో కారణాలతో ప్రయాణాన్ని వాయిదా వేస్తూ ఉన్నారని బాధితులు తెలిపారు. తదుపరి మరింత ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీ ఉందని, మాయమాటలతో అదనపు చార్జ్ కూడా అడ్వాన్సుగా వసూలు చేశారని వారు పేర్కొన్నారు. తమ డబ్బులను తిరిగి రాబట్టుకునేందుకు ట్రావెల్స్ వారి చుట్టూ తిరిగేందుకు కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టామని ఈ కేసులో వారు తెలిపారు. తాము దాచుకొని పొదుపు చేసుకున్న సొమ్ముతో సరైన సమయంలో విదేశీ విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నామని, ట్రావెల్స్ నిర్వాకంతో ఇబ్బందులకు గురయ్యామని కూడా తెలిపారు. విలువైన సమయంతోపాటు తాము అడ్వాన్సుగా చెల్లించిన డబ్బును ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కు నివేదించారు.
ఈ కేసును విచారణ చేసిన అనంతరం కమిషన్ వారు వినియోగదారు తుమ్మ అప్పిరెడ్డి చెల్లించిన రూ.71,000 కేసు నమోదు చేసిన నాటి నుంచి 7 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అంతేకాక ఫిర్యాదుదారులకు జరిగిన ఇబ్బంది, వేదనకు రూ.10,000, లిటిగేషన్ ఖర్చులకుగాను రూ.10,000 45రోజుల్లోపు చెల్లించాలని కూడా
ఖమ్మంజిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చారు. ఈ కేసులో వినియోగదారుల తరఫున న్యాయవాదులు మల్లెంపాటి అప్పారావు, వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, కొలికొండ శరత్ బాబు న్యాయవాదులు గా వ్యవహరించారు.