రాష్ట్ర ప్రభుత్వానికి రూ.88.55కోట్ల డివిడెండ్ చెల్లించిన సింగరేణి
సీఎంకు చెక్కు అందించిన సీఎండీ బలరామ్
✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 11)
రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.88.55 కోట్లు డివిడెండ్ (లాభంలో వాటా)గా చెల్లించింది. సీఎం ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ డివిడెండ్ చెక్కును సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అందజేశారు. సింగరేణి కాలరీస్ చెల్లింపు మూలధనం (పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ) లో 10 శాతాన్ని డివిడెండ్ గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం దాదాపు రూ.173 కోట్లు కాగా, సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి అందులో నుంచి రూ.88.55 కోట్ల డివిడెండ్ చెల్లించింది.
దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలు తీర్చుతూ లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి సంస్థ కార్మికులకు లాభాల వాటా చెల్లించడంతోపాటు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లు చెల్లించడం పట్ల సీఎం, డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.