తెలంగాణ “భూభారతి” చట్టానికి గవర్నర్ ఆమోదం
‘వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తాం‘
‘ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలందిస్తాం‘
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 9)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మకమైన భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందిన “భూభారతి బిల్లు” కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరలో ఈ చట్టం అమలులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలు సత్వరమే అందించాలన్న మంచి ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకు రావడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని చెప్తూ, చట్టం రూప కల్పనలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రప్రజలందరి అభిప్రాయాలు క్రోడీకరించి, సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టం తెచ్చామన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించడం గురించి ప్రత్యేక దృష్టిసారించాలని పొంగులేటి అధికారులకు సూచించారు. రెవెన్యూ చట్టం -2020 వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు . భూ సమస్యలేని గ్రామం తెలంగాణలో లేదని, గత ప్రభుత్వ పాలకులు తమ స్వార్ధం కోసం, ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్దను పూర్తిగా చిన్నాభిన్నం చేశారన్నారు. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే, కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను, తమ ప్రభుత్వం గ్రామస్థాయికి అందించడానికి విస్తృతంగా చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ పాలనను చూడడానికి ప్రతి రెవెన్యూగ్రామానికి ఒక అధికారిని నియమించబోతున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పని చేయాలని కోరారు. రెవెన్యూ వ్యవస్దను ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రజలు కేంద్రబిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా పని చేయాలన్నారు.