భార్యాభర్తల ప్రాణాలు తీసిన అప్పులు
అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
ఓ నిండు కుటుంబంలో పెనువిషాదం
✍️ భూపాలపల్లి – దివిటీ (జనవరి 1)
ముక్కుపచ్చలారని ప్రాయంలో కన్నవాళ్ల బలవన్మరణం ఆ అన్నదమ్ములను అనాథలుగా మార్చింది… తల్లిదండ్రుల అకాలమరణం దిక్కుతోచని దుస్థితిలోకి నెట్టడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది… తమను ఆదుకునేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆ ఇద్దరు పిల్లల దుస్థితి చూసినవారి గుండెల తరుక్కు పోతున్నాయి… భూపాలపల్లి జిల్లాలోని కమలాపూర్ లో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తమ ఇద్దరు కుమారులు 14 సంవత్సరాల రిషి, 12 సంవత్సరాల జశ్వంత్ లతో సాగిపోతున్న వారి బతుకు బండి క్రమంగా దారితప్పింది.
గ్రామాల్లో మహిళలను గ్రూపుగా చేసి, అప్పులిచ్చే ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల వద్ద ఆ ప్రాంత ప్రజలు రుణాలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి వారం ఒక్కొక్కరు రూ.200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది. కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినప్పటికీ తన భర్త, పిల్లలు అనారోగ్యాల బారినపడడంతో చందన కొన్నాళ్లుగా కిస్తీలు కట్టలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఫైనాన్స్ యజమాని ఒత్తిడి, కుటుంబ నిర్వహణ పట్ల భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చందన డిసెంబరు 6వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా తోటివారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పరిస్థితిపై ఆందోళన చెందిన దేవేందర్ డిసెంబరు 20న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే చికిత్స పొందుతున్న చందన మంగళవారం మృతిచెందడం కమలాపూర్ లో తీవ్ర విషాదం నింపింది. తల్లిదండ్రులిద్దరూ బలవన్మరణానికి పాల్పడటంతో ఇద్దరు పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది.