ఏకంగా రూ.5లక్షల లంచంతో…
ఏసీబీకి చిక్కిన ఆర్డీఓ కార్యాలయ అధికారులు
✍️ న్యూస్ నెట్ వర్క్- దివిటీ (డిసెంబరు 23)
ఓవైపు తెలంగాణ రాష్ట్ర అవినీతినిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు చేస్తున్నా, అవినీతి అధికారులు మాత్రం ‘తగ్గేదేలే’ అన్న రీతిలో స్వైరవిహారం చేస్తున్నారు. ‘అడిగినంత లంచమిస్తే ఎంతటి పనైనా అడ్డగోలుగా చేసేస్తాం…’ అనే స్థాయిలోనే యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్న దుస్థితి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల అక్రమాస్తులతో అవినీతి నిరోధక శాఖకు ఓ ఇంజనీర్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తూ సోమవారం వికారాబాద్ జిల్లాలో తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు ఏకంగా రూ. 5లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ రహదారి భూమి (LF Road )ని పట్టాభూమిగా భూ వర్గీకరణ చేయడానికి (రికార్డుల్లో మార్చి నమోదు చేయడానికి) ఫిర్యాదుధారుని నుంచి ఆ మొత్తం లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖాధికారులకు పట్టుబడ్డారు. తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ (పరిపాలన అధికారి)గా పనిచేస్తున్న వై. దానయ్యతోపాటు, సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మాణిక్ రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనలో వారిద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏసీబీ అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రాథమిక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరైనా పని చేసిపెట్టేందుకు లంచం అడిగితే, వెంటనే
టోల్ ఫ్రీ నెంబర్.1064 కు డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు.