పోలీసుస్టేషన్ పరిశీలించిన జిల్లా ఎస్పీ


✍️ అశ్వారావుపేట – దివిటీ (నవంబరు 22)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, అక్కడే పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పెండింగులోని కేసులను పరిశీలించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, ఏమైనా సందేహాలు తలెత్తితే ఉన్నతాధికారుల సలహాలు, న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ వాటిని పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలని సూచించారు. కోడిపందాలు, జూదం అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందిని వర్టికల్స్ వారీగా వారి పని సామర్ధ్యం గురించి తెలుసుకున్నారు. కేటాయించిన విధులను ఎవరికివారే సక్రమంగా నిర్వర్తించాలని తెలియజేశారు. విధులపరంగా ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ కరుణాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు యయాతిరాజు, శివరామకృష్ణ, దమ్మపేట ఎస్సై కిషోర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.