కాగ్ అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణస్వీకారం


ఆ హోదాలో తొలి తెలుగు అధికారిగా గుర్తింపు
✍️ డిల్లీ, అమరావతి – దివిటీ (నవంబరు 21)
దేశంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన లెక్కలను తనిఖీ చేసి, లోపాలేమైనా జరిగితే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ-కాగ్) బాధ్యతలను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారి కొండ్రు సంజయ్మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతి హోదా లో నియమితులై ఆయన గురువారం ప్రమాణస్వీకారం చేశారు. డిల్లీలో రాష్ట్రపతిభవన్లో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తి ఘనత సాధించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడైన కె.సంజయ్ మూర్తి,1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివిన ఆయన ఆ తర్వాత 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులలో పలు హోదాల్లో పనిచేశారు. 2021 సెప్టెంబరులో జాతీయ ఉన్నతవిద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సిన సంజయ్ మూర్తి గత సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం కాగ్ అధిపతిగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ పదవి చేపట్టిన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కానీ కొనసాగడానికి వీలుంది. సంజయ్మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన పనిచేశారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్రప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు. సంజయ్ మూర్తి కీలకమైన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.