మత్తు పదార్థాల నివారణకు జిల్లా పోలీసుల చర్యలు
జిల్లావ్యాప్తంగా మత్తుపదార్థాల నివారణపై అవగాహన కార్యమాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మత్తుపదార్థాల వినియోగంతో వాటిల్లే నష్టాల గురించి బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మత్తులో విచక్షణ కోల్పోయి ప్రమాధాలకు గురవ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారని, మత్తుకు బానిసలై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నవారిలో మార్పు తీసుకురావడానికి పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించడం ద్వారా యువత భవిష్యత్తు నాశనం కాకూడదనే సదుద్ధేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జిల్లాలోని అన్ని స్కూళ్లు, కళాశాలలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా, విక్రయించడం, వినియోగించడంలాంటి వాటికి పాల్పడే వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ దిశగా పటిష్టమైన ప్రణాళికతో జిల్లాలోని పోలీసు అధికారులు పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. మత్తు పదార్థాల అక్రమరవాణా గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారమందించాలని జిల్లా ప్రజలను ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా కోరారు.