రోటరీక్లబ్ ఆఫ్ రివర్ సైడ్ సేవలు అభినందనీయం

పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్
✍️ బూర్గంపాడు – దివిటీ (నవంబరు 20)
రోటరీక్లబ్ ఆఫ్ రివర్ సైడ్ భద్రాచలం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలను దాతలందరూ ముందుకు వచ్చి చేయాలని పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్ ప్రశంసించారు. రోటరీక్లబ్ ఆఫ్ రివర్ సైడ్ భద్రాచలం ఆధ్వర్యంలో బుధవారం క్లబ్ అధ్యక్షుడు డాక్టర్.మడిపెద్ది రమేష్ అధ్యక్షతన నాగినేనిప్రోలురెడ్డిపాలెం గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికలకు పది సైకిళ్లు, రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే నిరుపేదలకు తోపుడుబండ్లు, వికలాంగులకు ఐదు వీల్ చైర్లు వితరణ చేశారు. నాగినేనిప్రోలురెడ్డిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ ఆర్ సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సైకిళ్ల బహుకరణ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ప్రశంసించారు. లబ్దిదారులకు తోపుడుబండ్లను ముఖ్యఅతిథి డీఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. రోటరీ నాయకుడు బూసిరెడ్డి శంకర్ రెడ్డి సహకారం, డీఎస్పీ సతీష్ కుమార్ చేతులమీదుగా కార్యక్రమం నిర్వహణ సంతోషంగా ఉందన్నారు. రోటరీక్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ సహకారంతో 8వ తరగతి బాలికలకు ఉచితంగా 10 సైకిళ్లు, రోటరీక్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సహకారంతో అయిదుగురు పేదలకు 5తోపుడు బళ్లు, రోటరీక్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ సహకారంతో ఐదుగురు దివ్యాంగుల కు వీల్ చైర్స్ ఉచితంగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని క్లబ్ అధ్యక్షుడు డాక్టర్.మడిపెద్ది రమేష్, ప్రోగ్రాం చైర్మన్ బాచిన రామకృష్ణ, క్లబ్ కార్యదర్శి గంజి సంపత్, కోశాధికారి ధనకొండ రాఘవయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్వంచ సీఐ వినయ్ కుమార్, బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై రాజేష్, స్కూలు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ ఎం.యధుసింహరాజు, అధ్యాపకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.