గ్రూప్-3 పరీక్షకేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 16)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఈ నెల 17, 18 తేదీలలో 39 పరీక్షకేంద్రాల్లో 13,478 మంది అభ్యర్థులు హాజరుకానున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగూడెంలోని 26 పరీక్ష కేంద్రాలు, పాల్వంచలో 13పరీక్షకేంద్రాల వద్ద దాదాపు 350 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.17 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. మళ్లీ సోమవారం, 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష సమయాన్ని నిర్ణయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు, అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
- పరీక్ష రాయడానికి వచ్చే అభ్యర్థులు ఉదయం రాసే వారైతే 9.30 గంటలలోపు, మధ్యాహ్నం రాసే వారైతే 14.30గంటల లోపు హాజరుకావాలి. ఈ సమయాలకు పరీక్షకేంద్రాల మెయిన్ గేట్లు మూసివేస్తారు.
- అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు.
- అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు.
- మంటను ప్రేరేపించే వస్తువులు గానీ, ఇంకు బాటిల్స్, అనుమతి లేని ఇతర వస్తువులను కూడా తమ వెంట తీసుకురాకూడదు.
- మాల్ ప్రాక్టీస్ నకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
- గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపోహలకు,ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఈపరీక్షకు హాజరుకావాలని కోరారు.
- ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రూప్ -3 పరీక్షా కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణలు సమావేశం ఏర్పాటు చేసి బ్రీఫింగ్ ఇచ్చారు.