ఉమ్మడి ఖమ్మంజిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యం






సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 15)
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుని ఆయన మంత్రుల సమక్షంలో గురువారం ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించిన సీఎం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన మూడో పంప్ హౌస్ను ములకలపల్లి మండలం కమలాపురంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, అశ్వాపురం మండలం బీజీకొత్తూరులో తొలి పంప్హౌస్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ‘స్విచ్ ఆన్’ చేసి ప్రారంభించారు. సీఎంతోపాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి అప్పటి ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని, కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవంనాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు నిధుల కోసం ఒత్తిడి చేస్తే తాను మిగతా జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నానని తెలిపారు ఎన్ని ఒత్తిళ్లున్నా నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి రూ.1లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వలేదని ఈ సందర్భంగా సీఎం విమర్శించారు. కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెబుతారు గనుకనే ఆ పార్టీ నేతలు నీళ్ల కోసం ఆందోళన చేయలేదన్నారు. నాగార్జునసాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టామని, లింక్ కెనాల్ పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటపడి చేయించామన్నారు. మంత్రి తుమ్మలపై నమ్మకంతో నష్టపరిహారం ఇవ్వకపోయినా లింక్ కెనాల్కు రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాలు పెంచారని, కమీషన్ల కోసం పంప్ మోటార్లు పెట్టారు గానీ నాలుగేళ్లుగా పంప్ హౌస్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పంప్ హౌస్లో నీరు పారేలా చేశామన్నారు. కృష్ణా జలాలు రాక పోయినా ఖమ్మంజిల్లాకు గోదావరి నీళ్లందే అవకాశం ఉందని వివరించారు. పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో నీటి పంచాయితీ లేకుండా గోదావరి నీళ్లతో ఖమ్మంజిల్లాలో ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. తమను హరీశ్ అభినందించకపోయినా ఫర్వాలేదుగానీ అవమానించే విధంగా మాట్లాడొద్దని కోరారు. రానున్న రోజుల్లో 20 నుంచి 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను గుర్తించి, ప్రాధాన్యతక్రమంలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు సీఎస్ శాంతికుమారి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, పోలీస్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యేలు, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.