దిష్టిబొమ్మ ఆధారంగా హత్య కేసు ఛేదించిన సీఐ
అశ్వారావుపేట సీఐ కరుణాకర్ కు డీజీపీ నుంచి ప్రశంసాపత్రం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 7)
ఒక మహిళ హత్యకు గురైన కేసులో నేరస్థలం దగ్గర లభించిన కేవలం ఒక దిష్టిబొమ్మ ఆధారంగా కేసును చేదించి, నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షపడేలా కృషి చేసినందుకు అశ్వారావుపేట సీఐ కరుణాకర్ కు రాష్ట్ర డీజీపీ నుంచి ప్రశంసాపత్రం లభించింది. ఆయన ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ డాక్టర్.జితేందర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కరుణాకర్ చుంచుపల్లి సీఐగా పనిచేసే సమయంలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఓ మహిళ హత్యకు గురయ్యారు. ఆ కేసు దర్యాప్తులో ఓ దిష్టిబొమ్మ ఆధారంగా కేసును చేదించిన కరుణాకర్, నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష పడేవిధంగా కృషి చేశారు. హత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితులకు శిక్షపడేలా కృషిచేసి ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందిన సీఐ కరుణాకర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.