జడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 7)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపరిషత్తు ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజాపరిషత్తు పాలకవర్గం పదవీకాలం మంగళవారంనాటికి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రత్యేకాధికారిగా జిల్లాకలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విడిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్తుకు ఎన్నికలతో ఏర్పడిన తొలి పాలకవర్గం 2019 ఆగస్టు 7వ తేదీన ప్రమాణస్వీకారం చేసింది. ఈ జిల్లాకు జడ్పీ ఛైర్ పర్సన్ గా అప్పటి ఇల్లందు జడ్పీటీసీ సభ్యుడు కోరం కనకయ్య ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ కారణాలతో రాజీనామా చేసిన ఆయన ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్న కంచర్ల చంద్రశేఖరరావు, ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ జి.వి.పాటిల్ జడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేకాధికారిగా బాధ్యతలను స్వీకరించిన కలెక్టర్, జిల్లా పరిషత్ కార్యాలయం మొత్తం పరిశీలించారు. భవనాలకు అవసరమైన మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జడ్పీ ఉద్యోగులందరూ సమన్వయంతో పని చేస్తూ కార్యాలయానికి మంచి పేరుప్రతిష్టలు తేవాలని కోరారు. కార్యక్రమంలో సీఈఓ కె.చంద్రశేఖరరావు, శ్రీనివాసరావు, పర్యవేక్షకులు, సిబ్బంది హాజరయ్యారు.