లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలు : డీఎంహెచ్ఓ
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 16)
చట్టాలను అతిక్రమించి ఎవరైనా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఎల్.భాస్కర్ నాయక్ హెచ్చరించారు. మంగళవారం డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గర్భస్థ లింగనిర్ధారణ చట్టం -1994 (పి.సి అండ్ పి.ఎన్.డి.టి యాక్ట్) సంబంధించి నిర్వహించిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించారు. సమావేశంలో చర్చించిన మీదట కమిటీ కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. ఎవరైనా చట్టం అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, ఏ సరైన కారణం లేకుండా అబార్షన్ చేసినా వారిపై కూడా కఠినచర్యలు తప్పవని కమిటీ హెచ్చరించింది. పర్మిషన్ కోసం ఎవరైనా దరఖాస్తు చేస్తే అన్నిరకాల ధ్రువపత్రాలు సమర్పిస్తేనే వారికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఐఈసీ మెటీరియల్ ప్రింట్ చేసి పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఓఎంసీహెచ్ డాక్టర్.చైతన్య, డాక్టర్. అనూష, అడ్వకేట్ పార్వతి, డాక్టర్.కోరాశ్రీయాదవ్, డీపీఆర్ఓ ఎండీ.అజ్గర్ హుస్సేన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎండీ ఫైయాస్ మోహిద్దీన్, డీపీఎంఓ పి.శ్రీనివాసరావు, హెచ్ఈలు టి.విజయ్ కుమార్, బేబీ, తదితరులు పాల్గొన్నారు.