పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, రైటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 12)
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు.
కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో జిల్లాలోని పోలీసుస్టేషన్ల కోర్టుడ్యూటీ కానిస్టేబుళ్లు, రైటర్లు, టెక్ టీం ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తితే డీసీఆర్బీ అధికారులకు తెలియజేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి పరిష్కారం అయ్యే వరకు ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో పొందుపరచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు. ఆన్ లైన్ లో పొందుపరిచే క్రమంలో ఏవైనా సమస్యలుంటే వెంటనే ఐటీ సెల్ సహకారం తీసుకోవాలన్నారు. నేరస్తులకు శిక్షపడేలా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, భద్రాచలం, దుమ్ముగూడెం, చుంచుపల్లి, కొత్తగూడెం 1టౌన్, 3టౌన్, ఇల్లందు, అశ్వాపురం సీఐలు సంజీవరావు, అశోక్, వెంకటేశ్వర్లు, కరుణాకర్, శివప్రసాద్, సత్యనారాయణ, అశోక్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.