ఆపరేషన్ ముస్కాన్-10 ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
జిల్లాలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు : ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 1)
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ -10 జులై1 నుంచి 31వరకు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలలో బాల కార్మికుల విముక్తి కోసం దాడులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రత్యేక బృందాలను ఈ దాడులు నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో భాగంగా బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగిస్తామని ఆయన తెలిపారు. బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్-10 బృందాలు గుర్తించిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అనాధ పిల్లలను సంరక్షణ గృహాలకు తరలిస్తామని తెలియజేశారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనబడితే వెంటనే డయల్-100 కి కానీ 1098కి కానీ ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ -10 ద్వారా జిల్లాలో బాలకార్మికులను గుర్తించి, వారిని సంరక్షించడమే ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు.