ఎన్నాళ్లో ‘వేచిన’ విజయం…
టీ20లో భారత్ అద్భుత విజయం
ఉత్కంఠగా ముగిసిన ఫైనల్ మ్యాచ్
✍️ దివిటీ మీడియా – క్రీడావిభాగం
టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సొంతం చేసుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్ అటు స్టేడియంలో వేలాదిమంది అభిమానులను, ఇటు టీవీల ముందు కోట్లాదిమంది వీక్షకులను అలకరించింది. భారత ఆటగాళ్ల కళ్ల నుంచి ఆనందభాష్పాలను రాల్చింది. అద్భుతమైన విజయం తర్వాత భారత ఆటగాళ్ల కళ్ల నుంచి జలజలా కారిపోయిన కన్నీటిచుక్కలు, వారు ఈ టైటిల్ పై పెట్టుకున్న ఆశలను తెలియజేసింది. ఫైనల్ ఓవర్లో రెండు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా తన భారత జట్టుకు తానందించిన విజయాన్ని తలచుకుని కన్నీరు కార్చడం ప్రపంచంలోని కోట్ల మంది అభిమానులను కూడా ఉద్వేగానికి గురిచేసింది. మరో వైపు కప్పును కొద్దిదూరంలో చేజార్చుకున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు బాధతో విలపించారు. టీ20 టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా ఆశలకు చెక్ పెట్టిన భారత జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 11 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. ప్రపంచకప్పును సగర్వంగా ముద్దాడిన భారతజట్టు తన సత్తా చాటింది. భారతజట్టు నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో హెన్రిచ్ క్లాసెన్(52) సుడిగాలి ఇన్నింగ్స్ తో భారతజట్టుకు గుబులు పుట్టించాడు. ఆ దశలో కప్పు చేజారిపోయినట్లేనని భయపడిన భారతీయుల కలలు నెరవేర్చేలా హార్దిక్ పాండ్యా(3/20), బుమ్రా(2/18)లు తమదైన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పారు. ఆఖరు ఓవర్లో రెండు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా భారత్ కు 7 వికెట్ల అద్భుత విజయాన్నందించాడు. ఈ విజయంలో సూర్యకుమార్ అద్భుతమైన క్యాచ్ కూడా ప్రధానమైన పాత్ర పోషించిన విషయం ఎవరూ మర్చిపోలేరు.