సంవత్సరంలోపే సమస్యలన్నింటికీ పరిష్కారం
ఖమ్మం రూరల్ మండల పర్యటనలో మంత్రి పొంగులేటి





రుణమాఫీని స్వాగతిస్తూ ఆరెంపులలో మంత్రికి పాలాభిషేకం
✍️ ఖమ్మం – దివిటీ (జూన్ 23)
రాబోయే సంవత్సరంలోపే పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీనిచ్చారు. ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా ఆదివారం కైకొండాయిగూడెం, టీఎన్జీఓస్ కాలనీ, సాయి గణేష్ నగర్, సాయిప్రభాత్ నగర్, నాయుడుపేట, ఆరెంపుల గ్రామాలను సందర్శించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ తనను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగలేదని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పేదవారి ప్రభుత్వం తెచ్చుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పానని, తప్పకుండా రాబోయే సంవత్సరంలోపే ఈ నియోజక వర్గంలో ప్రధాన సమస్యలంటిని పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. గడిచిన పది సంవత్సరాల్లో పేదలకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. తమ హయాంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. లింక్ రోడ్లన్నీ పూర్తి చేయిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాబోయే రెండు నెలల్లోనే రూ.31వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నట్లు మరోమారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కాకిగోలను తలదన్నే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి కొట్టుకు పోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టాల్సి వస్తోందని తెలిపారు. నాయుడుపేట గ్రామంలో ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు చెక్కులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. రుణమాఫీని స్వాగతిస్తూ ఆరెంపుల గ్రామంలో బండి జగదీష్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.