భద్రాద్రిలో గోదావరి స్నానఘట్టాలు పరిశీలించిన కలెక్టర్

స్నానఘట్టాలలో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
✍️ దివిటీ – భద్రాచలం (జూన్ 22)
భద్రాచలంలో గోదావరినదిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మరణించిన ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా గోదావరిలో స్నానం చేస్తారని, భక్తులు స్థానాలు చేసే ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో గోదావరిలో సరదాగా ఈతకు వెళ్లి ఐదుగురు బాలురు ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగిపోవడంతో దగ్గరే ఉన్న జాలర్లు నలుగురిని కాపాడినప్పటికీ ఓ బాలుడు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులనడిగి తెలుసుకున్నారు. గోదావరి నదిలోకి భక్తులు స్నానానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా లోతుకి వెళ్లకుండా ప్రమాదసూచికలు ఏర్పాటు చేయడమేకాక భక్తులకు తప్పనిసరిగా సమాచారం అందించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలేమీ ఇకముందు జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని 24గంటలు తప్పనిసరిగా గోదావరి పరిసరాల్లో ప్రత్యేకనిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. భక్తులు గానీ ఇంకెవరైనాగానీ గోదావరిలో దిగేటప్పుడు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వారు ఎక్కువ లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు చెప్పుతూ ఉండాలన్నారు. రాత్రి సమయంలో భక్తులు, ప్రజలెవరైనాగానీ గోదావరి నది పరిసరాల్లో తిరగకుండా సంబంధిత పోలీసులు ప్రత్యేక నిఘాతో, పర్యవేక్షణ పగడ్బందీగా ఉండాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. శనివారం జరిగిన సంఘటన పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, సీడబ్ల్యూసీ అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.