హామీలు నెరవేర్చడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు…!
వచ్చే నెల నుంచి రూ.31 వేల కోట్లతో రుణమాఫీ అమలు


నేలకొండపల్లి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి
✍️ దివిటీ – నేలకొండపల్లి (జూన్ 22)
పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ విడతలవారీగా నెరవేర్చడం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంజిల్లాలో శనివారం నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా మోటాపురం, శంకరగిరి తండా, రాజేశ్వరపురం, అమ్మ గూడెం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, అరెగూడెం, ఆచార్లగూడెం, బోదులబండ, మండ్రాజుపల్లి తదితర గ్రామాలను నందర్శించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసం వనరులన్నీ సమకూరుస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చేనెల నుంచి రుణమాఫీ అమలవుతుందన్నారు. రూ.31వేల కోట్లతో రైతుల రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం చేయబోయే రుణమాఫీని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు నోరుజారుతూ, ఏవేవో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పేదవాళ్లలో అతిపేదవాళ్లకు ముందుగా మంజూరు చేస్తామన్నారు. లిఫ్ట్ లు రిపేరు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాజేశ్వరపురం గ్రామంలో నేలకొండపల్లి మండల కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.