Divitimedia
KhammamLife StylePoliticsSpot NewsTelanganaWomenYouth

‘అక్రమ పెన్షన్లు రద్దు ; అర్హులకే మంజూరు’

అక్రమ పెన్షన్లు రద్దు ; అర్హులకే మంజూరు

మా ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు

తిరుమలాయపాలెం పర్యటనలో మంత్రి పొంగులేటి

✍️ తిరుమలాయపాలెం – దివిటీ మీడియా (జూన్ 9)

తమది ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావులేదని అక్రమపద్ధతిలో పొందిన పెన్షన్లు రద్దుచేసి, అర్హులకే అందిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం తిరుమలయపాలెం, రమణ తండా, బీసరాజుపల్లి, వెదుళ్లచెర్వు, పిండిప్రోలు, తెట్టలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరాతండా, జల్లెపల్లి, జోగులపాడు, హైదర్ సాయిపేట, పడమటి తండా, పాతర్లపాడు, గోల్ తండా, చంద్రు తండా, ఇస్లావత్ తండా, మహ్మదాపురం, కుక్కల తండా, మేకల తండా, దమ్మాయిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కష్టం ఫలితంగానే ఇందిరమ్మరాజ్యం వచ్చిందన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే విచారణ చేపట్టి వాటన్నింటినీ ఆపేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని భూసమస్యలు తనదృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఇళ్లపై నుంచి వెళ్లిన హై టెన్షన్ విద్యుత్ లైన్లను కూడా రెండు నెలల్లో మార్పిస్తామని చెప్పారు. వర్షాకాలం సాగుకు చివరి భూముల వరకు నీళ్లిచ్చే విధంగా అధికారులు చూడాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. మంత్రి పర్యటనలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

వలస ఆదివాసీలకు ప్రత్యేక చికిత్సలు

Divitimedia

వడ్డీలేని రుణాలతో వ్యాపార దక్షత పెరుగుతోంది

Divitimedia

వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలి

Divitimedia

Leave a Comment