పీసీబీ ఆధ్వర్యంలో ఘనంగా పర్యావరణ దినోత్సవం


✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (జూన్ 5)
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కొత్తగూడెం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో ‘గ్రీన్ ర్యాలీ’ నిర్వహించారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు జరిగిన ఈ ర్యాలీని పర్యావరణ ఇంజనీర్ బి. రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. క్యాప్స్ విడుదల చేసి ర్యాలీలో పాల్గొన్న వారందరికీ పంచారు. ఈ ర్యాలీలో కేటీపీఎస్, సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, పలు ఇతర పరిశ్రమల అధికారులు, ప్రతినిధులు, సింగరేణి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లో “నేల పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకోవడం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పర్యావరణ ఇంజనీర్ బి. రవీందర్ మాట్లాడుతూ, పర్యావరణ కాలుష్య నియంత్రణ చట్టాలు – జిల్లాలో వాటి అమలు, పరిశ్రమలు, ప్రజలు తమ దైనందిన జీవితంలో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యల గురించి వివరించినారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి వాటి బదులు నార, గుడ్డ సంచులు వాడాలని కోరారు. కొత్తగూడెం సింగరేణిస్కూల్ ప్రిన్సిపల్ జి.ఎం. ప్రభాకర్ రావు, మాట్లాడుతూ పర్యావరణహితమైన చర్యల గురించి ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ప్రాముఖ్యత వివరించారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బి.వి రావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అంశం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పర్యావరణహితమైన చర్యల గురించి మాట్లాడారు. నారసంచులు విడుదల చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కొత్తగూడెం ప్రాంతీయ కార్యాలయం అధికారి, పర్యావరణ ఇంజనీర్ రవీందర్, సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎన్. వెంకటేష్, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త జి.లింగయ్య, కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు.