ఐటీసీలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా


✍️ దివిటీ మీడియా – సారపాక (జూన్ 3)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పేపర్ కర్మాగారంలో పెండింగ్ సమస్యలపై నిరసనగా సోమవారం ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కార్మికులు పెద్దసంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడారు. ఇన్ టైం అగ్రిమెంట్ అని చెప్పి ప్రస్తుత గుర్తింపు కార్మికసంఘం వేతన ఒప్పంద కాలం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఒప్పందంలో రాసుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. దీనికి నిరసనగానే ఐటీసీ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని గుర్తింపుసంఘానికి, సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా భారీ నినాదాలతో నిరసన తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఒప్పంద పత్రంలో రాసుకున్న ఎన్నో సమస్యలు పెండింగులో ఉన్నాయని, అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల నివాసం కోసం నూతన క్వార్టర్స్ నిర్మించాలని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 140 పాత క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించి కార్మికులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. భోజనశాల (డైనింగ్ హాల్)లో ఏసీ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల స్కిల్ మాట్రిక్స్ పూర్తి చేయాలని కోరారు. ఇలా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసిన అనంతరం మొత్తం 30 పాయింట్ల మీద యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.