ఆదివాసీలు ప్రభుత్వ వైద్యంతో ప్రాణాలు కాపాడుకోవాలి
ఏజెన్సీ వైద్యంపై సమీక్షలో ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍️ దివిటీ మీడియా – భద్రాచలం (మే. 6)
మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో నిరుపేద గిరిజనులు రోగాలు సోకినప్పుడు మూఢనమ్మకాలతో నాటు వైద్యం జోలికి పోకుండా ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బంది సలహాలు, సూచనలతో సరైన వైద్యం తీసుకుని తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఏజెన్సీలో వైద్య సౌకర్యాలపై ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లతో ఆదివాసీ గ్రామాల్లో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న గిరిజనులకు వైద్యం పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన పి.హెచ్.సి వారీగా, డాక్టర్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పును బట్టి గిరిజనులు జ్వరాల బారినపడితే తప్పనిసరిగా ఆశా వర్కర్లు వారి ఇండ్లకు వెళ్లి రక్త నమూనాలు సేకరించి టెస్టింగ్ పంపించాలన్నారు. నిరుపేదలైన ఆదివాసీ గిరిజనులు ఆర్ఎంపీలను సంప్రదించి, మోతాదుకు మించి మందులు వాడడం వల్ల తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పీఓ తెలిపారు. పి.హెచ్.సి డాక్టర్లు తమ పరిధిలోని ఆర్ఎంపీలు పరిధిని దాటి వైద్యం చేయకుండా నియంత్రించాలని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు సోషల్ మీడియా, ఇతర ప్రచార సాధనాల ద్వారా ఆదివాసీ గిరిజనులకు అవగాహన కల్పించాలని, ఎవరైనా జ్వరాల బారిన పడితే తప్పని సరిగా పి.హెచ్.సి కి వచ్చేలా చూడాలని అందుకు వైద్య సిబ్బంది తప్పనిసరిగా గ్రామాలలో ఇంటింటికి తిరిగి గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన గ్రామాల్లో గిరిజనులకు, గర్భిణులకు, చిన్నారులకు ఆరోగ్యపరంగా సలహాలు, సూచనలు ఇవ్వడానికి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను నియమించామని, వారి సహాయ సహకారాలతో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆ గ్రామాల్లో తప్పనిసరిగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మారుమూల . ఆదివాసీ గిరిజనులు తప్పనిసరిగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజ్ కుమార్, జిల్లాలోని మెడికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.