ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…
సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు



✍ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా
రైతుల భూముల హక్కులు అత్యంత సురక్షితంగా ఉండే విధంగా ‘ధరణి పోర్టల్’ రూపొందించామని చెప్పిన నాటి సీఎం కేసీఆర్ మాటలు నీటిమూటలే అంటూ నేటి సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై కీలకమైన ఆదేశాలు జారీచేశారు. ఇంతకాలం ప్రైవేట్ ఏజెన్సీ గుప్పిట్లో ధరణి పోర్టల్ నిర్వహణ సాగుతోందంటూ వెల్లడించిన సీఎం, ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఆ ఏజెన్సీ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వమే బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. తెలంగాణాలోని లక్షల మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయంటూ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా, ఆధార్, రైతుల బ్యాంక్ ఖాతాలకు చెందిన వివరాలన్నీ ఆ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూరికార్డుల డేటాకు భద్రత ఉందా? సురక్షితంగా ఉన్నట్టా? లేనట్టా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి. మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్వో వి. లచ్చిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారడం, డైరెక్టర్లు అందరూ మారిపోవడం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందనేది ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా? అని సీఎం అధికారులను ప్రశ్నించారు. 2018లో కేవలం రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ, తర్వాత తమ వాటాలు దాదాపు రూ.1200 కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన భూముల రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున విలువైన భూముల యాజమాన్యం పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణ విషయమై నియంత్రణ, ప్రభుత్వ ఆజమాయిషీ కూడా లేదా? అంటూ రెవెన్యూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ధరణి దరఖాస్తులకు మోక్షం
పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం
మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు
మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ
ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం ఎ రేవంత్ రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటివారంలోనే అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో పెండింగ్ ఉన్న 2.45లక్షల పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించడానికున్న మార్గాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
2020లో అమల్లోకి వచ్చిన ఆర్ర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవిన్యూ రికార్డుల నవీకరణ వల్లనే కొత్త చిక్కులు వచ్చాయని కమిటీ సభ్యులు చెప్పారు. ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం యజమాని పేర్లలో చిన్న అక్షరదోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తోందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యూల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది.
లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పు సవరించుకోవాలంటే రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని ఈ సమీక్షలో చర్చ జరిగింది. ధరణిలో ఉన్న డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలలో నిధులు జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయడమో లేదంటే మరో కొత్త ఆర్ఓఆర్ చట్టం చేయడమో తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.
ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయడమో, లేదంటే కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నింటి మీద మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని ధరణి కమిటీని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాల వల్ల ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా కూడా చూడాలని సీఎం రేవంత్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడు పెండింగులో ఉన్న దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.