పోలీసుశాఖలో పనిచేసేవారు దృఢంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు

జిల్లా నుంచి ఎంపికైన 75 మందిని ప్రాధమిక శిక్షణకు ట్రైనింగ్ సెంటర్లకు తరలింపు
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం, ఫిబ్రవరి 20
ప్రత్యక్షంగా ప్రజలకు సేవలందించడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని, పోలీసుశాఖలో పనిచేయాల్సిన ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండాలని అందుకోసమే ప్రతి ఒక్కరికీ ముందుగా క్రమశిక్షణతో కూడిన శిక్షణను అందించడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరిగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులై జిల్లా నుంచి ఎంపికైన 75 మంది అభ్యర్థులను 9 నెలల ప్రాధమిక శిక్షణ కోసం మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్లకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసుశాఖలో పని చేసేందుకు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. శారీరకంగా దృడత్వం పెంచే శిక్షణతోపాటు ఇతర శిక్షణా తరగతులలో అందరూ మంచి ప్రావీణ్యం సాధించి విజయవంతంగా తమ శిక్షణను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. శిక్షణ నిమిత్తం ట్రైనింగ్ సెంటర్లకు వెళ్లే జిల్లా అభ్యర్థులందరూ ఉత్సాహంగా, మంచి ప్రతిభతో, క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా సివిల్ కానిస్టేబుల్ (పురుషులు) 27 మందిని సైబరాబాద్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)కు, సివిల్ కానిస్టేబుల్ (మహిళలు) 18 మందిని వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)నకు పంపించారు. అర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ (పురుషులు) 22 మందిని యూసుఫ్ గూడలోని మొదటి బెటాలియన్, ఏఆర్ (మహిళలు) 8 మందిని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) ట్రైనింగ్ సెంటర్లకు పంపించారు. వీరందరిని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఆయా ట్రైనింగ్ సెంటర్లకు పంపించినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, అడ్మిన్ ఆర్ఐ రవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.